ఎన్ని వేల వర్ణాలో…
“నీ స్మృతుల గజ్జెలు కరాళనృత్యం చేసే వేళ, ఓ ప్రాత:జ్ఞాపకం కపోతమై తన రెక్కల చప్పుడు వినిపించింది…
కొన్ని ఘడియలు నన్ను నీనుండి విముక్తుడిని చేసింది”
ఆ రోజు దసరా కావడం వలన వచ్చిన సెలవును వినియోగించుకుంటున్న ఓ బద్దకస్తుడిని నేను. ఉదయం పదిన్నరవుతుంది. నిద్ర మత్తులోంచి కొంచెం కొంచెం బయట పడుతుంటే; గుర్తుకు రాకూడని వారెవరో తలపుకొచ్చి సతమతమవుతుంటే; ఫోను మోగడం మొదలుపెట్టింది. ఈ రోజూ ఏకాంతంగా గడుపుదాం అనుకుని ఫోను స్విచ్చాఫ్ చేద్దాం అనుకునేలోగానే అది మోగడం మొదలెట్టింది. అదేదో తెలియని నెంబరు. కట్టేద్దామనుకుంటూనే అప్రయత్నంగా పచ్చ బటను నొక్కేసాను. అది నా డిప్లొమో క్లాస్మేట్ భాస్కర్ నుండి వచ్చింది. వాడూ నేనూ ఎప్పుడన్నా ఫోనులోనే మాట్లాడుకుంటున్నాం కానీ చూసి చాలా రోజులయ్యింది. “ఏరా, మన డిప్లొమో క్లాస్మేట్స్ ఓ పది మందిమి ఇప్పుడు లుంబినీ పార్క్లో కలుసుకున్నాము. నువ్వు వస్తావా” అని అడిగాడు. వస్తానని చెప్పాను వాడితో. ఎప్పుడో 11 ఏళ్ళ క్రితం చూసాను వాళ్ళని. ఎలా ఉంటారో అని ఊహిచుకుంటుంటే ఏవరూ గుర్తుకురావడం లేదు. ఒంటి గంటకు లుంబినీ చేరుకున్నా. దూరం నుండి చూస్తే అక్కడ భాస్కర్ ఒక్కడే గుర్తున్నాడు. దగ్గరకు వెళితే కొంత మందిని పోల్చుకోగలిగాను. వాళ్ళ పేర్లు మాత్రం గుర్తుకు రావడంలేదు. వాళ్ళకి మాత్రం నా పూర్తి పేరూ, నా రోల్ నంబరు కూడా గుర్తుంది. నేనిలా గజనీలా మారిపోయినందుకు నాకే చాలా సిగ్గనిపించింది. అప్పట్లో అందరితోనూ కలివిడిగా ఉండేవాడిని కాదు (ఇప్పుడు కొంచెం నయం). నా రూము, నా క్లాసు అంతే. అక్కడ చదువు ముగిసాకా విడిపోతున్నప్పుడు అందరూ అందరి చిరునామాలు తీసుకున్నాము. ఆ కాయితం కాలక్రమంలో కనిపించకుండా పోయింది. అప్పట్లో ఈమెయిలూ సొల్లుఫోనులూ ఉండేవికావు. ఆ తర్వాత ఓ ఇద్దరితో మాత్రమే పరిచయం కొనసాగింది.
ఇప్పుడు చాలా మందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. పండగ పూట వాళ్లంతా శ్రీమతుల అనుమతితో ఓ రెండు గంటలు బయటికి వచ్చారు. మధ్యాహ్నం దాటిపోతుండడంతో అందరం అమీరుపేటలోని కాకతీయకు చేరుకుని భోంచేసి మాటల్లో పడ్డాము. మళ్ళీ జనవరి 25న కలుద్దామని నిశ్చయించుకున్నాము. వాన మొదలవ్వడంతో కొందరు తడుస్తూనే బయలుదేరిపోయారు. మిగిలినవాళ్లం వాన తగ్గేదాకా పిచ్చాపాటి మాట్లాడుకుని సెలవు తీసుకున్నాం.



తెలుగుబ్లాగు గుంపులో చావాకిరణ్ ఇచ్చిన ఈ వారం బ్లాగ్ విషయం మీ దగ్గరలోని గ్రంథాలయాలు కు నా స్పందన
మా కాలనీలో ఒక గ్రంథాలయం ఉండేది. అన్ని తెలుగు నవలలూ అక్కడ ఉండేవి. అవే కాకుండా అన్ని ప్రముఖ వీక్లీలు మంత్లీలు ఉండేవి. ఏదన్నా పుస్తకంలో గడి కనిపిస్తే సాధ్యమైనంతవరకూ నింపెయ్యడం అలవాటు. స్వాతి, మయీరి అక్కడ ఎక్కువ తిరగేసేవాడిని. ముఖ్యంగా తెలుగుకు సంభందించినవి కనిపిస్తే వదిలేవాడిని కాదు. రీడర్స్ డైజెస్ట్ని అప్పుడప్పుడూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడిని.
ఇక మా ఇంట్లో విషయం చెప్పాలి. మా నాన్న ఆంధ్ర సచిత్ర వారపత్రిక తెచ్చేవారు. మా కోసం చందమామ తెచ్చేవారు. నేను పత్రికను కూడా చదివేవాడిని. దానిలో నేను పూర్తిగా చదివిన సీరియల్ రావినూతల సువర్ణాకన్నన్ రాసిన మంజీరనాదం. అది నాకు ఫ్యాంటసీగా అనిపించి చివరిదాకా చదివేసాను. ఏదన్నా సీరియల్ పూర్తైతే ఆ సీరియల్ ఉన్న అన్ని వారాల పేజీలనీ మా నాన్న ఒక పుస్తకంగా బైండ్ చేసేవారు ( ఆయన పనిచేసే కంపేనీలో మన చేపలను, రొయ్యలను, మామిడిపండ్లను విదేశాలకు ఎగుమతి చెయ్యడానికి మైనపు పూత పూసిన అట్టపెట్టెలు తయారయ్యేవి; మా పుస్తకాలకు అట్టలు వేసుకోవడం మాకు అప్పుడు బాగా సులువు అయ్యేది ). దాదాపు ఓ పాతిక దాకా పోగయ్యాయి. వాటిని మా కాలనీలో ఉండేవాళ్ళు తీసుకెళ్ళే వాళ్ళు. వాటిలో చివరికి ఏమీ మిగలలేదనుకోండి!
చందమామ చదివీ చదివి బోర్ కొట్టింది. ఎక్కడో బాలమిత్ర, బాలజ్యోతి, బొమ్మరిల్లు కనిపించాయి. అన్నీ నచ్చేసాయి. ఇక నేనే పుస్తకం కొనుక్కుంటానని చెప్పి డబ్బులు అడిగి తీసుకుని మరికొంత పోగేసి బాలమిత్ర, బాలజ్యోతి కొనేవాడిని. కొనడానికి దూరం వెళ్ళవలసి వచ్చినా ఆలోచించేవాడిని కాదు. ఒకచోట లేకపోతే ఇంకోచోట వెతికి కొనుక్కునేవాడిని.
అంతే కాకుండా ప్రతీ ఆదివారం ఈనాడు తెచ్చేవారు. ఈనాడు మేగజైన్లో పదకేళీ నింపడం అప్పుడు ఓ సరదా. మేగజైన్ చివర కనిపించే బూదరాజు గారి తెలుగు పదాలకి సంభందించిన శీర్షికని వదిలేవాడిని కాదు. ఇంట్లో పుస్తకాలు ఎక్కువై అమ్మెయ్యవలసి వస్తే ఆ పేజీలు చింపి దాచేవాడిని. ఇప్పటికీ అవి నా దగ్గర ఉన్నాయి.
మా పక్కింట్లో ఉండే ఆంటీ ఎంతెలా నవళ్ళు చదువుతారంటే; పవర్ పోయినా కొవ్వొత్తి ముందు చేతిలో పుస్తకంతో కనిపించేవారు. ఆవిడ దగ్గరనుండి కాంచనద్వీపం, కీర్తికిరీటాలు, దాంపత్యవనం, కన్యాశుల్కం ఉంటే దసరా సెలవులకి తెచ్చుకుని చదివాను.
నర్శిపట్నంలో డిప్లొమా చదివే రోజుల్లో లైబ్రరీకి వెళ్ళడం తక్కువే కానీ విపులని మాత్రం క్రమం తప్పకుండా కొని చదివేవాడిని. ఇంజనీరింగ్లో అది కూడా లేదు.
నేను చివరిసారిగా చదివిన పూర్తి నవల ది డావిన్సీ కోడ్.
స్మృతిలో మెదిలినవి ఇలా రాసేసాను…

