
మొదటి చరణంలో కాస్త కవితాత్మకంగా సాగినా రెండవ చరణంలో అది వాస్తవంలోకి వచ్చింది. తన తండ్రి తనని ఎంత ఆప్యాయంగా చూస్తున్నారో చెబుతూనే; అలా అయితే తను కోరిన తీరం చేరుకోలేనని చెబుతుంది. తన కోసం తన తండ్రి ఎన్నో చేస్తున్నా తన కోరుకుంటున్నది తనకు ఎలా దక్కుతుందని బాదపడుతుంది. తన మనసులో తనకే స్థానం లేదంటుంది. చివరికి ప్రేమనే తనకు దారిచూపించమంటుంది.
కోటి కూర్చిన బాణీ సాధారణంగా ఉన్నా చిత్ర చాలా భావయుక్తంగా పాడారు.
పల్లవి:
ఏ చోట ఉన్నా నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలౌతుంటే
రేపులేని చూపు నేనై శ్వాసలేని ఆశ నేనై మిగలనా
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతిక్షణం నా మౌనం ||ఏ చోట ఉన్నా||
చరణం 1:
నేల వైపు చూసే నేరం చేసావని నీలిమబ్బు నిందిస్తుందా వానచినుకుని
గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని తల్లితీగ బందిస్తుందా మల్లెపువ్వుని
ఏమంత పాపం ప్రేమా ప్రేమించడం - ఇకనైనా చాలించమ్మా వేధించడం
చెలిమై కురిసే సిరివెన్నెలవా క్షణమై కరిగే కలవా ||నువ్వే నువ్వే||
చరణం 2:
వేలు పట్టి నడిపిస్తుంటే చంటిపాపలా; నా అడుగులు అడిగే తీరం చేరేదెలా
వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కలా; కంటిపాప కోరే స్వప్నం చూసేదెలా
నాక్కూడ చోటే లేని నా మనసులో - నిన్నుంచగలనా ప్రేమా ఈ జన్మలో
వెతికే మజిలీ దొరికే వరకు నడిపే వెలుగై రావా ||నువ్వే నువ్వే||